Thursday 24 August 2023

నన్ను రచయితగా మార్చిన సోవియట్ రాదుగా ప్రచురణలు - దేవులపల్లి కృష్ణమూర్తి

 ఈ క్రింది జ్ఞాపకంను దేవులపల్లి కృష్ణమూర్తి గారు నాకు నకిరెకెల్ లో వారి ఇంటికి వెళ్లినప్పుడు చెప్పారు. ఈ జ్ఞాపకం తప్పకుండా రాయండి సార్, అని పదేపదే గుర్తుచేసి రాయించాను. తరువాత దీన్ని నమస్తే తెలంగాణాకు పంపాను. వాళ్ళు10 మే 2015  ఆదివారం పుస్తకంలో ముద్రించారు. 

ఈ గొప్ప వ్యాసం రాసిన దేవులపల్లి కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

- అనిల్ బత్తుల

^^^


నన్ను రచయితగా మార్చిన సోవియట్ రాదుగా ప్రచురణలు

- దేవులపల్లి కృష్ణమూర్తి

***

నా పన్నెండవ ఏట సూర్యాపేటలో ఏడవ తరగతిలో జాయిన్ అయిన. మిడిల్ స్కూలుకు పోవాలంటే గాంధీపార్క్ ముందునుండే పోవాల్సి వుండేది. గాంధీపార్కు ముందు వున్న పెద్ద పెద్ద వేపచెట్ల క్రింద జనగామ, హైద్రాబాదుకు పోయే గవర్నమెంటు బస్సులు, అట్లే జగ్గయ్యపేట, మిర్యాలగూడకు పోయే బొగ్గు బస్సులు నిలబడి వుండేయి. ఆ చెట్లనీడనే ప్రయాణికులు నిలబడి ఉండేది. అక్కడే యన్.జి.రెడ్డి అనే అతను బస్త చింపులు పరచి యక్షగానాలు, బుర్రకథలు, సినిమా పాటలు, పంచాంగాలు, పెద్దబాలశిక్ష, సోవియట్ ల్యాండ్ తో పాటు కమ్యూనిస్టు పుస్తకాలు కూర్చొని అమ్ముతుండేవాడు. వచ్చిపోయే ప్రయాణికులు వాటిని తిరగేస్తూ నచ్చితే కొనుక్కుంటూ వుండేది. నేను వస్తూపోతూ కొద్దిసేపు నిలబడి ఆ పుస్తకాలను చూస్తూ ఉండేది.

.

నా ఏడవ తరగతి అయిపోయినది. హైస్కూలుకు పోవడానికి కూడా అదే దారి. ఆణాలు పోయి నయాపైసలు వచ్చినయి. మేము ఇల్లు మారి బొడ్డురాయి బజారుకొచ్చినం. మా ఇంటి ముందు పబ్లిక్ లైబ్రరీ వుండేది. రోజూ సాయంత్రం ఏడు గంటలకు వాచ్ మెన్ చంద్రయ్య లైబ్రరి ముందు వరండాలో చాపలు పరిచి ఆరోజు దినపత్రికలు, వారపత్రికలు, చందమామ, బాల, బాలమిత్ర, నవ్వులు పువ్వులు, కినిమా మొదలైన పత్రికలు పెట్టేశాడు. సాయంత్రం బడినుండి రాగానే వాటిని తిరగేయటం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా బాల, చందమామ, బాలమిత్ర మరియు కినిమా పత్రికలు ఇష్టంగా చదువుతుంటి. నా ఈడు పిల్లలు వీటిని చదవడానికి పోటిపడుతుండేది. స్కూలు పుస్తకాలే కాక ఇతర పుస్తకాలు చదవటం అలా మొదలైంది.

.

నేను టెంత్ వచ్చేవరకు బొగ్గు బస్సులు తగ్గి సర్కారి బస్సులు వచ్చినయి. యన్.జి.రెడ్డి పుస్తకాల షాపు అట్లనే చెట్లకింద నడుస్తుంది. కొత్త కొత్త పుస్తకాలు వచ్చి చేరినయి. పిల్లల బొమ్మల పుస్తకాలు వాటిపై రంగు రంగు బొమ్మలతో ముద్దులొలుకుతూ వుండేయి, వాటి ధర ఎక్కవలో ఎక్కువగా ఇరవై పైసలు, పావలా ఉండేది. వాటిని ముట్టుకోబోతే "నువు కొనేదా పెట్టేదా వాటిని ముట్టుకోకు" అని కసిరించేవాడు. దానితో వాటిని రోజూ చూస్తూ వుండిపోయేవాణ్ణి. రెడ్డిగారు అలా కసిరి కొట్టడంలో పెద్దగా విచారించేది ఏమి లేదు. అప్పట్లో నా వేషం ముతక నెక్కరు, మాసిపోయివున్న ఆప్ షర్ట్, చెప్పులు మొఖం కానని కాళ్ళు. నాలో పెట్టుదల పెర్గింది. ఎట్టన్నజేసి ఓ పుస్తకం కొనాలని పడ్డది. ఒకనాడు బయట పరిచిన పుస్తకాలలో "అందమైన చిన్న పుస్తకం కన్పించింది. దాని పేరు 'కుక్కను వెంటబెట్టుకున్న మహిళ'. దాని ధర ఎంతంటే ఇరవై పైసలన్నడు.  వెంటనే జేబులోవున్న పావలా బిళ్ళ ఇస్తే ఆ పుస్తకం, ఐదు పైసలిచ్చిండు. ఆ పుస్తకం నేను కొంటాననుకోలేదు రెడ్డిగారు. దాన్ని రెండురోజులపాటు చదివిన ఎక్కలేదు. రెడ్డికి నా సత్తా ఏందో చూపాలని కొన్నాగాని దాన్ని చదివి అర్ధంచేసుకోగలనా లేనా అన్నది ఆలోచించలేదు. నా మిత్రుడు మండల్ రెడ్డి కృష్ణారెడ్డికి ఇస్తే బాగానేవుందిగదరా అన్నడు. వాడు 'మకరశ్రీ' అనే పేరుతో ఏవో కథలు రాస్తూండేవాడు. పోనియ్యిలే అని దాన్ని భద్రపరచుకొన్న. తర్వాత కొన్నాల్లకు 'జమీల్యా' అనే పుస్తకం కనిపించింది. దాని ధర పావలా, కావాలా అన్నడు. ఇవ్వండి అంటూ పావలా చేతిలో పెట్టిన. బ్లూకలర్లో ఉండి ఎంతో అందంగా వుందా పుస్తకం. దాన్ని చదవటం మొదలు పెట్టిన. వదలబుద్ది కాలేదు. అలా సోవియట్ పుస్తకాలతో నా అనుబంధం మొదలైంది. ఇంతలోనే పరీక్షలు మొదలైనయి. నేరుగా బడికి పోవటం ఇంటికొచ్చి చదువుకోవటంతోనే గడిచిపోయింది. హెచ్చెసి పాసయిన తర్వాత, ఏడాదిపాటు ఉద్యోగాన్వేషణలో గడిచిపోయింది. చివరకు తహశీలు ఆఫీసులో యల్.డి.సి గా జాయిన్ అయిన.

.

ఇప్పుడు యన్.జి.రెడ్డి తన బుక్ షాపును పోస్టాఫీసు వెనుక PWD ఆఫీసు కాంపౌండు నానుకొని వున్న చింత చెట్లక్రింద డబ్బాకొట్టుకు మార్చి, దానికి 'స్టార్ బుక్ హౌస్' అని పేరు పెట్టిండు. అతనికి సంతానం లేదు. భార్యాభర్తలు ఆ దుకాణంలోనే సాయంత్రందాక వుంటుండేది. షాపును పెద్దదిగా చేసిండు. సోవియట్ బుక్సు విజయవాడ విశాలాంధ్ర బుక్ హౌస్ నుండి తెప్పించేవాడు. నేను తీరికవున్నప్పుడల్లా సాయంత్రంపూట ఆ షాపుకు పోయి కూర్చుండేవాణ్ణి. తాసీలు ఆఫీసులో ఉద్యోగినని నన్ను గౌరవిస్తూ బెంచిపై కూర్చోబెట్టి "ఈపుస్తకం చూడండి సార్, కొత్తగా వచ్చింది.." అంటూ చూపించేవాడు. అలా పోయినపుడల్లా నాకో కొత్త నవలను కథల పుస్తకాన్ని పరిచయం చేస్తుండేది. అలా నేను రాళ్ళవంకీ, నలభై ఒకటవ వాడు, అన్నా కెరినినా, మనకాలం వీరుడు వంటి పుస్తకాలు ఆ షాపులో కొన్నాను. అవి చదివి ఎంతో ఆనందించేది. మృష్టాన్నభోజనం చేసినట్టుగా వుండేది.

.

మా ఆఫీసు మిత్రులు నేను ఈ పుస్తకాలు చదువుతుంటే "నువ్వు కమ్యూనిష్టునా..?" అని అంటుండిరి. "ఈ పనికిమాలిన పుస్తకాలు చదివితే ఏమొస్తది బై" అంటూ గేలి చేస్తుండిరి. వాల్ల మాటలు పట్టించుకోక నా మానాన నేనుంటుండేది. అలా సోవియట్ 'రాదుగ' ప్రచురణలతో నా అనుబంధం పెరిగిపోయింది. ఎప్పుడన్నా హైదరాబాదుకు పోతే సుల్తాన్ బజారులో వున్న విశాలాంధ్ర బుక్ హౌస్ కు పోయి సోవియట్ రాదుగ ప్రచురణల గూర్చి అడిగితే ఆ నెలలో వచ్చిన కొత్త పుస్తకాలను ముందరేసేవాల్లు. అలా నేను పసివాడి పగ, పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లాడు, నొప్పి డాక్టరు, మిత్రుని హృదయం, ఉక్రేనియన్ జానపద గాధలు మొదలైన పుస్తకాలు కొనియుంటి.

.

ఇందులో కొన్ని పుస్తకాలు మిత్రులకు చదువమని ఇచ్చియుంటి. తీసుకున్నవాళ్ళు ఏండ్లు గతించినా తిరిగి ఇవ్వలేదు. అడిగి అడిగి విసిగిపోయిన. ఇక ఎవ్వరికి పుస్తకాలు ఇవ్వగూడదని నిర్ణయించుకున్న. కాని అప్పటికే చాలా పుస్తకాలు పోయినయి. కొన్ని పుస్తకాలను రెండు రెండు కాపీలు కొనడం జరిగింది. ఈ విషయం రాదుగ ప్రచురణలన్ని ఒక్క షెల్ఫు లో పెట్టాలన్ని యేర్పాటు చేసినపుడు తెలిసింది. విజయవాడ పోయినపుడు, అనంతపురం పోయినపుడు అక్కడి విశాలాంధ్ర బుక్ హౌస్ కు పోయి కొనియుంటి. కొన్న వాటిని వెంటనే చదువక రిటైర్ అయిన పిదప చదువాలని భద్రపరిచిన. నేను 1998లో రిటైర్ ఆయువుంది. 2005 వరకు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని నావద్ద వున్న రాదుగ, ప్రగతి ప్రచురణల పుస్తకాలన్ని చదివిన. అందులో రెండవ ప్రపంచయుద్ధకాలంలో రాసినవి నాకెంతో నచ్చినయి.

.

ఆనువదించిన వాల్లలో వుప్పల లక్ష్మణరావు గారి అనువాదాలు ఎంతో హాయిగా చదివించాయి. జమీల్యా, తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు మొదలైనవి. తదుపరి ఆర్వీఆర్ అనువాదాలు. అనువాదకులు తమ అభిప్రాయాలు వ్రాయటం రాదుగ ప్రచురణలలో అలవాటు లేదు. అయినా 'మనకాలం వీరుడు' నవలకు ఆర్వీఆర్ ముందుమాట వ్రాసిండు. రాచమల్లు రామచంద్రారెడ్డి ట్రాన్సులేషన్సు అంతగా కొరుకుడు పడేవి కావు. కొండేపూడి లక్ష్మీనారాయణ, గిడుతూరి సూర్యం, నిడమర్తి ఉ మారాజేశ్వరరావు గారు కొన్నిటిని అనువదించి యుండిరి.

.

మా మిత్రుడు రచయిత బోయ జంగయ్య రామన్నపేటలో యస్.టి.వో ఆఫీసులో పనిచేస్తూవుండె. ఒకసారి మాటల సందర్భంలో 'ఆర్వీఆర్' అనే సోవియట్ యూనియన్ పుస్తకాలను అనువాదం చేసిండు చూడు మాకాడనే జూనియర్ కాలేజిలో ప్రిన్సిపాలుగా పనిచేస్తుండని చెప్పిండు. దానితో వారిని కలుసుకోవాలని రామన్నపేటకు పోయివుంటి. వారు ట్రాన్సులేషను చేసిన పుస్తకాల వివరాలను చెబితే మిక్కిలి ఆనందించాడు. తాము పదేండ్లకు పైచిలుకు సోవియట్ యూనియన్లో వున్నట్లు చెప్పిండు. సోవియట్ రాదుగ ప్రచురణలు ఆగిపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చినట్లు చెప్తూ రాగానే అప్పటి ముఖ్యమంత్రి  NTR గారిని కలిసి తన పరిస్థితి వివరిస్తే తన సెలవు పిరియడును రెగ్యులర్ చేసి ఇంకా ఒక సంవత్సరం మిగిలి వున్నందున ఇక్కడ జూనియర్ కాలేజిలో ప్రిన్సిపల్గా పోస్టింగు ఇచ్చినట్లు చెప్పిండు. సోవియట్ యూనియన్లో తన అనుభవాలను పుస్తకంగా తేబోతున్నానని చెప్పిండు.

.

రిటైరు అయిపోయిన తరువాత ఎటూ పొద్దుపోక నావద్ద వున్న సోవియట్ రాదుగ పుస్తకాలను మరల చదువుతూపోయిన. చదివినప్పుడల్లా నాకు కొత్త అందాలు కన్పించేయి. వ్రాసినవాళ్లలో చాలామంది తమ అనుభవాలనే నవలలుగా చిత్రీకరించారు. అట్లే నేవెందుకు నా అనుభవాలను వ్రాతలో పెట్టకూడదని భావించి వ్రాయటం మొదలు పెట్టిన.

ఎంత వ్రాసినా 10, 20 పేజీలకు మించటంలేదు. మరల ఓమారు రాదుగ ప్రచురణలను తిరగేస్తుంటే బాట దొరికింది. అలా నా మొదటి పుస్తకం "ఊరు వాడ బతుకు" వెలువడింది. ఇది నా డెబ్బైఏట వ్రాసియుంటి. అటు తర్వాత 'మా యాత్ర', 'కథలగూడు', 'బయటిగుడిసెలు' మరియు 'తారుమారు' వెలువడినయి. వీటన్నిటికి ప్రేరణ సోవియట్ రాదుగ ప్రచురించిన నవలలు, కథాసంపుటాలు మాత్రమే.

***




మంచంపైన దేవులపల్లి కృష్ణమూర్తి గారు, నేల మీద అనిల్ బత్తుల(నేను)



బాపు గారు గీసిన దేవులపల్లి కృష్ణమూరి గారి చిత్రం



దేవులపల్లి కృష్ణమూరి గారి సంతకం & ' స్టార్ బుక్ హౌస్ ' స్టాంప్




సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...