Wednesday 16 December 2020

సోవియట్ దేశంలో బౌద్ధ మతం, బౌద్ధులు

link: https://drive.google.com/file/d/17saIvHSaiH-PjhEVOh_2MPsXCWdYnSLn/view?usp=sharing







కొండగాలీ కొత్త జీవితం

 కొండగాలీ కొత్త జీవితం (ఆర్మేనియన్ కథలు అనువాదం - నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, కేశవ గోపాల్ )

---------------------------------------------------------------
ఇవన్నీ పాతరోజులు. సోవియెట్ యూనియన్ వల్ల ఆ ఛత్రం కింద దేశాలన్నీ ఏ మేరకు లాభపడ్డాయో లేదో కాని పుస్తక ప్రపంచం మాత్రం విపరీతంగా లాభపడింది. ప్రపంచమంతా సోవియెట్ సాహిత్యం శుభ్రమైన అట్టలతో నాణ్యమైన ఫాంట్‌తో పరిమళాలీనే కాగితంతో సాహితీ ప్రేమికుల ఒళ్లోకొచ్చి పడింది. రాదుగ, ప్రగతి ప్రచురణాలయాలు రాళ్లెత్తకపోయినా పుస్తకాలెత్తి ప్రపంచమంతా కొత్త సాంస్కృతిక సౌధాలను నిర్మించడానికి కష్టపడ్డాయి. ‘కొండగాలీ కొత్తజీవితం’ 1979 నాటిది. ఇందులోని తొమ్మిది ఆర్మేనియన్ కథలు- ఆ ప్రశాంతమైన పర్వత ప్రాంత జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతాయి. ఒక దేశం గురించి, ఒక జాతి గురించి తెలియాలంటే ఆ జాతిని సరిగ్గా ప్రతిబింబించే సాహిత్యాన్ని చదవడమే మార్గం. కథ అంటే ఏమిటో , జాతి కలిగిన కథ అంటే ఏమిటో ఈ పుస్తకం చదివి తెలుసుకున్నారు చాలామంది.

ఆర్మేనియా- సోవియెట్ యూనియన్ కింద అంత సుఖంగా లేదన్నది వేరే విషయం. ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన ఫ్యాక్టరీల వల్ల తమ అందమైన దేశం కాలుష్యం బారిన పడుతోందని గగ్గోలు పెట్టింది. సోవియెట్ యూనియన్ పతనానికి ఒక సంవత్సరం ముందు- అంటే 1990లో అది స్వతంత్రం ప్రకటించుకుంది. ఇప్పుడు అక్కడి సాహిత్యం ఎలా ఉందో తెలియదు. మన దాకా చేరే మార్గం కూడా లేదు. కాని మిగిలిన ఇలాంటి అరాకొరా పుస్తకాలే దాచుకున్న గులాబీ రెమ్మలు. ఊహల్లో మిగిలిన ఆకుపచ్చ లోయలు.
[17 జనవరి 2014 - సాక్షి ]



ఏవి ఆ సోవియెట్ రోజులు... - వాడ్రేవు చినవీరభద్రుడు

 ఏవి ఆ సోవియెట్ రోజులు...

- వాడ్రేవు చినవీరభద్రుడు
-------------------------------------
తెలుసుకోదగ్గ పుస్తకం:
ఆదోని డిగ్రీ కాలేజి వార్షికోత్సవానికి వెళ్లినప్పుడు అక్కడి లైబ్రరీలో ఉన్న ఎన్నో మంచి పుస్తకాల్లో ‘ఫిఫ్టీ సోవియెట్ పొయెట్స్’ (ప్రోగెస్ పబ్లిషర్స్ - 1974) చూడగానే నాకెందుకో బెంగగా అనిపించింది. డెబ్బైల్లోనూ ఎనబైల్లో కొంతకాలం దాకా సోవియెట్ పుస్తకాలు, కవిత్వం, కథలు ఎంతో చౌకగా విరివిగా దొరికేవి. నా చిన్నప్పుడు సత్తెనపల్లిలో జరిగిన జిల్లా సైన్సు ఫెయిర్‌లో నాకు బహుమతిగా దొరికిన మూడు పుస్తకాలూ సోవియెట్ పుస్తకాలే. యాకోవ్ పెరొల్మాన్ రాసిన నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం నా హైస్కూలు రోజుల్లో ఎన్నిసార్లు చదివానో. మార్క్స్, ఎంగెల్సు రచనలు, లెనిన్ రచనలు పూర్తి సంపుటాలతో పాటు గోర్కీ అమ్మ, టాల్‌స్టాయ్ కొసక్కులు, అన్నా కెరెనినా, డాస్టవిస్కీ పేదజనం-స్వేతరాత్రులు, తుర్గనెవ్ తండ్రులూ-కొడుకులూ, కుప్రిన్ రాళ్లవంకీ కథలు, చింగిజ్ అయిత్‌మాతోవ్ నవలలు, ఆర్మేనియన్ కథలు ‘కొండగాలీ-కొత్త జీవితం’, పిల్లల బొమ్మల పుస్తకాలూ ఆ రోజుల్లో దాదాపుగా ప్రతి సాహిత్యమిత్రుడి భాండాగారంలోనూ కనిపించేవి. రష్యన్ కవిత్వం కన్నా సోవియెట్ కవిత్వం, ముఖ్యంగా రసూల్ గాంజటవ్, జైసన్ కులియెన్ వంటి వారి పుస్తకాలు ఎంతో అందమైన ముద్రణల్లో కనిపించేవి. చెకోవ్ మొత్తం కథలు నాలుగు సంపుటాల్లో వచ్చిన అందమైన ప్రచురణలో మూడు సంపుటాలు ఇప్పటికీ భద్రంగా నా దగ్గరున్నాయి.
ఫిఫ్టీ సోవియెట్ పొయెట్స్ పుస్తకం చూడగానే ఈ జ్ఞాపకాలు మనసులో మెదలడంతో కలిగిన బెంగ కొంతమాత్రమే కాని అసలు సోవియెట్ ప్రయోగమే నా హృదయాన్ని కలచివేసింది. ఇరవయ్యవ శతాబ్దం చూసిన మహత్తర మానవ సామాజిక ప్రయోగాల్లో సోవియెట్ రష్యా ఆవిర్భావం కూడా ఒకటి. శతాబ్దం ముగియకుండా ఆ ప్రయోగం కుప్పకూలిపోవడం మరొకటి. సోవియెట్ రష్యా ఏర్పడినప్పుడు అది శ్రీశ్రీ స్తుతించినట్టుగా ‘భావికాల స్వర్ణభవన నిర్మాతగా మారుతుందనే’ ప్రపంచమంతా ఎదురుచూసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ దగ్గర నాజీ సైన్యాల్ని సోవియెట్లు నిలవరించి ఉండకపోతే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేదని మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటరత్నంగారు ఎంతో ఉద్వేగంగా చెప్పేవారు. కాని ఇప్పుడదంతా ఒక గతంగా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోవడం నా బెంగకి కారణం.
ఎనభైలలో గోర్బచెవ్ పెరిస్త్రోయికా గురించి మాట్లాడినప్పుడు ఆర్‌ఎస్ సుదర్శనం దగ్గరకు వెళ్లి గ్లాస్ నోస్త్, పెరిస్త్రోయికా అంటే ఏమిటని అడిగితే ఆ పదాలు సోవియెట్ గోడలు పగుళ్లు బారుతున్నాయనడానికి సంకేతమనీ, ఆ వ్యవస్థ తొందర్లోనే కూలిపోనున్నదనీ వివరించారాయన.
అవన్నీ తలంపులోకి రాగా ఇప్పుడీ యాభై మంది సోవియెట్ కవుల కవితా సంకలనం తెరవగానే రష్యన్ స్టెప్పీల పచ్చగడ్డి వాసనతో పాటు అందులోని యుద్ధాల పొగా, సైబీరియన్ ఖై దీల అశ్రువుల వెచ్చదనం కూడా నా చుట్టూ ముసురుకున్నాయి. ఈ పుస్తకం ముందుమాటలో ఇలా ఉంటుంది - ‘హింసకీ శత్రుత్వానికీ వ్యతిరేకంగా ఇది గళం విప్పింది. ప్రపంచంలో శాశ్వతంగా కనవచ్చే కాయకష్టం, మాతృత్వం, ప్రకృతితో తాదాత్మ్యంలో మనిషి పొందే సంతోషం, ప్రజల మధ్య సంభవించే స్నేహం వంటి వాటి కోసమే ఈ కవిత్వం నిలబడుతున్నది’
సమకాలీన సోవియెట్ సంకలనల్లాగా కాకుండా ఈ సంకలనంలో అన్నా అఖ్మతోవా, సాస్టర్నాక్ వంటి కవులకి కూడా చోటు దొరికింది. తల్లి హృదయం అనుభవించే క్షోభ ఏమిటో అన్నా అఖమతోవా, మేరియా త్సెతావా వంటి వారికన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? తన పిల్లల ఆకలి తీర్చడం కోసం సోవియెట్ రష్యాలో మేరియా త్సెతావా దొంగతనానికి కూడా వెనకాడలేదని మనకు తెలుసు. ఇక స్టాలిన్ ప్రభుత్వం అక్రమంగా నిర్బందించిన తన కొడుకుని చూసుకోవడం కోసం, విడిపించుకోవడం కోసం అన్నా అఖ్మతోవా ఏళ్ల తరబడి వీధుల్లో ప్రభుత్వ కార్యాలయ్యాలో జైళ్ల ముందట పడిగాపులు పడింది. యుద్ధం, దుఃఖం, భగ్న ఆశలకు గుర్తు ఈ పుస్తకం.
[24 మే 2014 - సాక్షి ]



వారి అనువాద ప్రజ్ఞ చిరస్మరణీయం - కె.పి.అశోక్‌కుమార్‌

 వారి అనువాద ప్రజ్ఞ చిరస్మరణీయం

- కె.పి.అశోక్‌కుమార్‌
------------------------------- ----------------
అక్టోబర్‌ విప్లవం శత వసంతోత్సవాల ఆరంభం గురించి ప్రస్తావించుకోగానే మొదట గుర్తుకొచ్చేది సోవియట్‌ సాహిత్యమే. ప్రగతి, రాదుగ ప్రచురణాలయాల నుంచి వెలువడిన అనువాదాల పరంపర తెలుగు సమాజంపై, సాహిత్యంపై చూపిన ప్రభావం అపారమైంది. ఇవాళ సోవియట్‌ రష్యా అంతర్థానమై ఉండొచ్చు. కానీ ఆ అనువాదపు వెలుగుల ప్రభావం ఏదో రూపాన తెలుగు నేలపై నిలిచే వుంది. అనువాదాన్ని ఒక తపస్సుగా నిర్వహించిన ఆయా సృజనశీలుర మహత్తర కృషి అపూర్వమైంది. ఆ పుస్తకాలు అందుబాటులో లేకపోవచ్చు. వాటిని తిరిగి ముద్రించి వ్యాప్తి చేసే అవకాశాలు వున్నాయి. కనుకనే నాడు సోవియట్‌ సాహిత్యాన్ని, ఇతరేతర రచనల్ని తెలుగులోకి అనువదించిన వారి కృషి స్మరించుకోదగింది. క్రొవ్విడి లింగరాజు చేసిన గోర్కీ 'అమ్మ' అనువాదం అత్యంత ఉత్తేజపూరిత రచన. ఇక వుప్పల లక్ష్మణరావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆర్వియార్‌, నిడమర్తి ఉమారాజేశ్వరరావు, కేశవగోపాల్‌, కొడవటిగంటి కుటుంబరావు, మహీధర, డాక్టర్‌ పరుచూరి రాజారాం వంటి అనేకులు చేసిన అనువాదాలు పాఠకప్రపంచం మీద వేసిన ముద్ర విశేషమైంది. సోవియట్‌ సాహిత్యాన్ని అనువాదం చేసిన వారిలో వుప్పల లక్ష్మణరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈయన మాస్కోకు మొదటిసారి 1956లో వెళ్ళారు. అక్కడ లెనిన్‌గ్రాడ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఉత్తర భారత భాషా, సంస్కృతుల అధ్యయనానికే సోవియట్‌ విజ్ఞాన పరిషత్‌ పరిమితం కావడాన్ని ప్రశ్నించారు. దక్షిణాది ప్రాంత చరిత్ర, భాష, సంస్కృతుల ఔన్నత్యాన్ని వివరంగా చెప్పారు. తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని ప్రభావం తర్వాత కాలంలో పనిచేసింది. 1967లో మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలోనూ, మాస్కో రేడియోలోనూ తెలుగు భాషను ప్రవేశపెట్టారు. అనువాదాలు చేయించడం, పుస్తకాలు ప్రచురించడం, తెలుగు కార్యక్రమాల ప్రసారాలు వేగం పుంజుకున్నాయి. వుప్పల లక్ష్మణరావు పదమూడేళ్ళు మాస్కోలో ఉన్నారు. మార్క్సిజం, లెనినిజానికి సంబంధించిన సిద్ధాంత గ్రంథాలను చక్కటి తెలుగులోకి అనువదించారు. అలాగే గోర్కీ, గోగోల్‌, టాల్‌స్టారు, చింగీజ్‌ ఐత్‌మాతోవ్‌ లాంటి ప్రసిద్ధ సోవియట్‌ రచయితల రచనల్ని సరళ సుందరమైన రీతిలో తెలుగు చేశారు. ఈ క్రమాన పట్టుబట్టి రష్యన్‌ భాషను నేర్చుకొని తెలుగు-రష్యన్‌ నిఘంటువును రూపొందించారు. సోవియట్‌ రచనల్ని తెలుగు చేసిన అనువాదకుల్లో వుప్పల లక్ష్మణరావు కృషి ప్రత్యేకమైంది. మనలో చాలామంది ఇష్టపడే జమీల్యా నవలను రసరమ్యరీతిన అనువాదం చేసింది వుప్పల లక్ష్మణరావు గారే. మిహయిల్‌ షోలోకోవ్‌ కథల అనువాదం కూడా వారిదే. ఇక ' నొప్పి డాక్టరు ' ను ఆర్వియార్‌ అనువాదం చేశారు. ' యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం ' అనే పుస్తకాన్ని నిడమర్తి ఉమారాజేశ్వరరావు అనువదించారు. అలెక్సీయేవిచ్‌ స్వెత్లానా రచన ఇది. ఈమెకు గత ఏడాది నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది. ఈ పుస్తకాన్ని 1988లో ప్రగతి ప్రచురణాలయం ముద్రించింది. 1941-45 మధ్యన జరిగిన యుద్ధంలో పాల్గొన్న స్త్రీల పోరాట అనుభవాల్ని, సంవేదనల్ని వ్యక్తం చేసిన గ్రంథమిది. మంగోలుల మహానేత జెంఘిజ్‌ఖాన్‌ గురించి వి.యాన్‌. రాసిన నవలకు ఆర్వియార్‌ చేసిన అనువాదం బావుంది. జెంఘిజ్‌ఖాన్‌ గురించి సమగ్ర అవగాహనని కల్పించే అద్భుత రచన ఇది. ఇవాన్‌ తుర్గేనెవ్‌ రచించిన తండ్రులు కొడుకులు 330 పేజీలకి పైన ఉన్న నవల. కొండేపూడి లక్ష్మీనారాయణ అనువాదం చేశారు. చదవడం మొదలుపెట్టాక చివరి పేజీవరకు తన వెంట లాక్కువెళ్ళగలిగే లక్షణం ఉన్న నవల. గోర్కీ వ్యాసాలు, లేఖలు, ఇంటర్వ్యూలతో కూడిన ' స్వర్ణపిశాచి నగరం ' అనే పుస్తకాన్ని కూడా లక్ష్మీనారాయణ అందమైన తెలుగులోకి తీసుకొచ్చారు. నికార్సయిన బంగారం మాత్రమే కాలపు గీటురాయి మీద నిలుస్తుందంటారు. ఈవిధంగా నిలిచే వెలిగే మహారచయిత టాల్‌స్టాయ్. యుద్ధమూ-శాంతీ, కోసక్కులు, అన్నా కరేనినా, పునరుత్థానం వంటి అద్భుత రచనలు చేసిన టాల్‌స్టాయ్ కలం నుంచి జాలువారిన మరో మహాద్భుత రచన 'విషాద సంగీతం' దీనికి ఆర్వియార్‌ చేసిన అనువాదం చదివి అబ్బురపడతాం. ఇది కూడా మూడు వందల పేజీలకు పైగా ఉన్న పుస్తకం. విషాద సంగీతంతో పాటు విందునాట్యం తర్వాత మరికొన్ని గొప్ప కథలున్నాయి. ఈ పుస్తకం చదవడమే గొప్ప అనుభవం. శతాధిక గ్రంథకర్తగా పేరొందిన ఆర్వియార్‌ పేరిట ఒక అనువాద పురస్కారాన్ని విశాలాంధ్ర ఏర్పాటు చేస్తే బావుంటుంది. అన్నా కరేనినా తర్వాత చాలా బాగా నచ్చిన పుస్తకం విషాద సంగీతం. " టాల్‌స్టారుకి సొంత, విశిష్ట వైలక్షణ్యం వుంది. మరెవ్వరూ మానవ అంతరంగపు లోతుల్లోకి యింత గాఢంగా చొచ్చుకు పోలేదు. యింత విస్తారంగా విశ్లేషించలేదు " అని సోవియట్‌ సాహిత్య విమర్శకుడు ద్మిత్రీ పీసరెవ్‌ అంటారు. ఇది అక్షరాలా నిజం. అందువల్లనే రష్యన్‌ సాహిత్యంలో టాల్‌స్టాయ్ అత్యధికులకు ప్రీతిపాత్రుడైన రచయిత. ఆర్మీనియన్‌ కథల సంకలనం' కొండగాలీ కొత్త జీవితం ' మరో ఆకర్షణీయమైన పొత్తం. నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, కేశవగోపాల్‌ అనువాదమిది. 1979లో వచ్చిన ఈ సంకలనంలోని కథలు ఇప్పటికీ ఎంతో తాజాగా కనిపిస్తాయి. మానవుల భావోద్వేగాల్ని సృజించడంలో ఆయా రచయితలు చూపిన ప్రజ్ఞ అనూహ్యమైంది. కథలు రచించేవారు మరల మరల చదవదగ్గ మంచి పుస్తకమిది. రష్యన్‌ సాహిత్యంలో చెప్పుకోదగ్గ మరో మంచి నవల ' మన కాలం వీరుడు' .
లేర్మంతోవ్‌ రచించిన ఈ నవలకి ఆర్వియార్‌ చేసిన అనువాదం రసరమ్యమైంది. వాస్తవికతకు దర్పణం పట్టే గొప్ప నవలగా అభివర్ణిస్తారు ఆర్వియార్‌. అంతేగాక రష్యన్‌ సాహిత్యంలో తొలి గొప్ప మనో విశ్లేషణాత్మక నవల కావడం విశేషం. సకల యూరోపియన్‌ భాషల్లోకి అనువాదమైన ఈ నవల ప్రపంచ సాహిత్యంలోనే ఉత్తమ కళాఖండంగా పేరొందింది. సోవియట్‌ సాహిత్య అనువాదాల్లో వచనానికే అధిక ప్రాధాన్యం. కవిత్వ అనువాదాలు చాలా అరుదు. ఆ అరుదైన వాటిలో ఆణిముత్యం మయకోవ్‌స్కీ రచించిన లెనిన్‌ కావ్యానికి శ్రీశ్రీ చేసిన అనువాదం. దీనిని 1924లో మయకోవ్‌స్కీ రచించారు. రష్యన్‌ విప్లవంపై వచ్చిన అరుదైన ఆధునిక కావ్యం ఇది. ఈ కావ్యాన్ని చదువుతుంటే ఓ మహౌద్వేగానికి లోనవుతాం. అంతటి శక్తి, వైశిష్ట్యం ఈ కావ్యానికి వుంది. ఈ అనువాదం శ్రీశ్రీ ప్రతిభను మరోసారి లోకానికి చాటింది. ఇలాంటి కావ్యాల్ని అప్పుడప్పుడు చదవాలి. ముఖ్యంగా కవిత్వం రాసేవారు పఠించదగ్గ గొప్ప కావ్యమిది. దోస్త్‌యేవస్కీ రచించిన నేరము-శిక్ష, పేదజనం శ్వేతరాత్రులు వంటి పుస్తకాల్లోని సృజనశక్తి అనుపమానమైంది. తల్లీ భూదేవి, గులాబీ మేఘాలు, తొలి ఉపాధ్యాయుడు, మానవుడే మహాశక్తి సంపన్నుడు వంటి రచనల ప్రాశస్త్యం చెప్పనలవి కానిది. అలాగే బాలసాహిత్యం ఎంతో ఉత్తేజపూరితంగా ఉండేది. ఈవిధంగా సోవియట్‌ సాహిత్యంలోని ప్రతి పుస్తకం పాఠకుల్ని ఉద్దీపింపజేస్తుంది. పెట్టుబడిదారీ అర్థశాస్త్రం పుస్తకాన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి అనువదించారు. ఆర్థికశాస్త్రానికి సంబంధించి వారు సృజించిన పరిభాష రాజకీయ, ఆర్థిక శాస్త్ర గ్రంథాల అనువాదానికి ఒక ఒరవడి పెట్టింది. కాగా, నిత్యజీవితంలో భౌతికశాస్త్రం రెండు భాగాలను కొడవటిగంటి కుటుంబరావు అనువదించారు. దాదాపు ఆరు వందల పేజీల గ్రంథమిది. అలాగే మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని డాక్టర్‌ పరుచూరి రాజారాం అనువదించారు. ఇది ప్రతి ఇంటా ఉండాల్సిన పుస్తకం. ఇందులోని భాష కూడా సులభగ్రాహ్యంగా ఉంటుంది. సాహిత్యమే గాక విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో రష్యన్‌ భాషలోంచి అనువాదమై తెలుగు నేలపై విజ్ఞానకాంతుల్ని ప్రసరింపజేశాయి. ఇందుకు దోహదం చేసిన అనువాదకుల్ని సదా స్మరించుకోడం మన బాధ్యత. సోవియట్‌ సాహిత్యం చదవడం వల్ల మన భాష కూడా మెరుగవుతుంది. తెలుగు భాషలోని అందచందాల్ని రమణీయమైన రీతిలో వాడుకున్నారు అనువాదకులు. అందువల్లనే సాహిత్యరంగంలో, మీడియాలో పనిచేస్తున్నవారు సోవియట్‌ సాహిత్యాన్ని ప్రత్యేకించి చదవాలి. అనువాదంలో సరళ సుందరమైన శైలిని సంతరించుకోడానికి కూడా సోవియట్‌ సాహిత్యం చదవడం ఉపకరిస్తుంది. ఒకతరం తెలుగువారు సమాదరించిన సోవియట్‌ సాహిత్యాన్ని చదవడం ఈతరం తెలుగు పాఠకులకు చక్కని అనుభవం.
[Nava telangana Darwaja, 07 October 2016 ]
Photo: Soviet book exhibition conducted by Anil battula on Tolstoy Birthday in Somajiguda Press club, Hyderabad..few years ago.
To read soviet telugu books: http://sovietbooksintelugu.blogspot.com



సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...